విద్యార్థులు, నిరుద్యోగులు,ఆర్టీసీ కార్మికులపై జరిగిన నిర్బంధాలను ప్రజలు మర్చిపోలేదు.
ప్రజలను తప్పుదారి పట్టించే రాజకీయ వ్యాఖ్యలు మానుకోవాలి.
నీట్ అవకతవకల్లో కేంద్రం దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంది
రామాయంపేట, జూలై 23 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) :
ఢిల్లీలో జరిగిన ఘటనల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు ఖండించారు. టీఆర్ఎస్ పాలనలో జరిగిన నిర్బంధాలను విస్మరించి ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరమని అన్నారు.
విద్యార్థులపై లాఠీచార్జీల గురించి మాట్లాడే ముందు టీఆర్ఎస్ హయాంలో హక్కుల కోసం పోరాడిన విద్యార్థులపై నమోదైన కేసులు, వారిపై జరిగిన నిర్బంధాలను గుర్తు చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరి, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో జరిగిన జాప్యం, నియామక పరీక్షల పేపర్ లీకేజీలు ప్రజలు మర్చిపోలేదన్నారు.ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై దాడులు, ప్రజాస్వామ్య హక్కులను అణిచివేసిన ఘటనలు టీఆర్ఎస్ పాలనలోనే చోటుచేసుకున్నాయని ఆరోపించారు. అలాంటి పాలనను ప్రజలు నిర్బంధ పాలనగానే గుర్తుంచుకున్నారని పేర్కొన్నారు.నీట్ పరీక్షల అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుందని, జరిగిన తప్పులను దాచిపెట్టలేదని రాగి రాములు తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడం సరికాదని, ప్రజలను తప్పుదారి పట్టించే విమర్శలు మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పద్మా దేవేందర్ రెడ్డికి సూచించారు. దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో బీజేపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

