కుత్బుల్లాపూర్, జూలై 23: (నవజ్యోతి ప్రతినిధి)
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్పల్లిలో ఉన్న టెక్ మహీంద్రా కార్యాలయం ఎదుట మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగి భావన గురువారం ధర్నాకు దిగింది. అకారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండటంతో మూడు రోజుల సెలవు కోసం ముందుగానే యాజమాన్యానికి సమాచారం ఇచ్చి అనుమతి కోరినట్లు ఆమె తెలిపింది. అయితే అనంతరం ఈ-మెయిల్ ద్వారా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం అందిందని ఆరోపించింది. కంపెనీలో ఉద్యోగులపై అనవసర ఒత్తిడి ఉంటోందని, వాష్రూమ్కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని పేర్కొంది. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ విధులకు హాజరు కావాలని ఒత్తిడి చేశారని కూడా ఆరోపించింది.
ఈ వ్యవహారంపై ఇప్పటికే దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపిన భావన, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేసింది. ఘటనపై పోలీసులు, టెక్ మహీంద్రా యాజమాన్యం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం ఇవి బాధితురాలు చేసిన ఆరోపణలు మాత్రమే; కంపెనీ స్పందన వెలువడాల్సి ఉంది.

