93 మందికి చెక్కుల పంపిణీ.. నిందితుడి అరెస్టుతో తిరిగొచ్చిన సొమ్ము…
ఆదిలాబాద్, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి): ఏళ్లుగా చిట్ఫండ్లో చిక్కుకుని తమ పొదుపు సొమ్ము కోసం ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా 93 మంది బాధితులకు ఎట్టకేలకు ఊరట లభించింది. కనకదుర్గ చిట్ఫండ్స్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, రూ.2,34,59,991 విలువైన చెక్కులను బాధితులకు అందజేశారు.
బాధితుల ఫిర్యాదుల మేరకు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. దర్యాప్తు సమయంలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేయడంతో, బాధితులకు బకాయిలను చెల్లించేందుకు నిందితుడు అంగీకరించాడు.
సబ్రిజిస్ట్రార్ పర్యవేక్షణలో 93 మంది బాధితులకు మొత్తం రూ.2.34 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ అధిక లాభాల పేరుతో మోసపూరిత పెట్టుబడి పథకాల బారిన పడవద్దని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకులు, నియంత్రిత ఆర్థిక సంస్థలు, చట్టబద్ధంగా నమోదైన చిట్ఫండ్ సంస్థల్లోనే పెట్టుబడులు పెట్టాలని, పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సూచించారు.
చాలా కాలంగా నిలిచిపోయిన తమ సొమ్ము తిరిగి అందడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకించి కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసి, తమకు న్యాయం జరిగేలా కృషి చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్తో పాటు దర్యాప్తు అధికారులను అభినందించారు.

