ర్యాలీ, రాస్తారోకో, దిష్టిబొమ్మ దహనంతో హోరెత్తిన బిక్కనూరు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
బిక్కనూరు, జూలై 23 (నవజ్యోతి ప్రతినిధి):
నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిక్కనూరు మండల కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి బిక్కనూరు చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసించారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ప్రతీకగా ఏర్పాటు చేసిన దిష్టిబొమ్మలను దహనం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.


ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. “మోదీ-షా తానాశాహీ నహీ చలేగీ.. నహీ చలేగీ”, “ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి”, “విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి”, “నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి” అంటూ నినాదాలతో బిక్కనూరు మారుమోగింది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని నిరసనకు సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం. చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, బిక్కనూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, సర్పంచ్ బల్యాల రేఖ, సొసైటీ చైర్మన్ భూమయ్య, ఆలయ కమిటీ చైర్మన్ లింబాద్రి, మాజీ మండల అధ్యక్షుడు , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భీమ్ రెడ్డి , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కర్నాల శ్రీను, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు జీవన్ , వివిధ గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు, మండల, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

