బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జయంతి నిర్వహణ
మహనీయుడి ఆశయాలు సమాజానికి ఆదర్శం : మస్కూరి బాలరాజ్
సమానత్వం,భక్తి, మానవ సేవ సందేశాలను ఆచరించాలని పిలుపు.
రామాయంపేట, జూలై 30(నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ):
గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సంత్ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రామాయంపేటలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మస్కూరి బాలరాజ్ ఆధ్వర్యంలో మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన జీవిత విశేషాలు, సమాజానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా మస్కూరి బాలరాజ్ మాట్లాడుతూ, శ్రీ సంత్ రవిదాస్ మహారాజ్ భారతదేశ భక్తి ఉద్యమంలో విశిష్ట స్థానం సంపాదించిన మహనీయుడని అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణతో పాటు సమాజంలో సమానత్వం, సామాజిక సామరస్యం, మానవత్వం వంటి విలువలను విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం నింపారని పేర్కొన్నారు.చెప్పులు తయారు చేసే కుటుంబంలో జన్మించినప్పటికీ అనేక అవమానాలు, కష్టనష్టాలను ఎదుర్కొంటూ ధర్మమార్గాన్ని విడిచిపెట్టకుండా సమాజానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. కాశీని కేంద్రంగా చేసుకుని భక్తి మార్గాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తూ సనాతన ధర్మ వైభవాన్ని చాటిచెప్పారని కొనియాడారు. సమాజంలో ఉన్న వివక్షలను తొలగించి ప్రతి మనిషి సమానుడనే భావనను బలంగా చాటిచెప్పిన మహోన్నత సంస్కర్తగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు.శ్రీ సంత్ రవిదాస్ మహారాజ్ బోధించిన “మానవ సేవే మాధవ సేవ”, ప్రేమ, భక్తి, సమానత్వం, సామాజిక సామరస్యం, సేవాభావం వంటి విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ ధర్మ పరిరక్షణతో పాటు సమాజ సేవలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.అనంతరం నాయకులు, కార్యకర్తలు శ్రీ సంత్ రవిదాస్ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ మోర్చాల ప్రతినిధులు, పలువురు భక్తులు పాల్గొని శ్రీ సంత్ రవిదాస్ మహారాజ్కు ఘనంగా నివాళులర్పించారు.

