కుత్బుల్లాపూర్, జూలై 5 :(నవజ్యోతి ప్రతినిధి) రాబోయే రోజుల్లో విద్యార్థి యువతను మరింతగా ఆకర్షిస్తూ బీఆర్ఎస్విని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలనే లక్ష్యంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సమీక్షా సమావేశం నిర్వహించారు. గండి మైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్, మాజీ ప్రధాన కార్యదర్శి శంభీపూర్ క్రిష్ణ సూచనల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో విద్యార్థి విభాగాన్ని గ్రామస్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు విస్తరించేందుకు కార్యాచరణపై నాయకులు దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించే విధంగా బీఆర్ఎస్వి పని చేయాలని, ప్రతి విద్యాసంస్థలో పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లేలా యువ నాయకత్వాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటు, సోషల్ మీడియా వేదికగా యువతను చైతన్యపరచడం, సేవా కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో చేరువ కావడం వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.
విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ముందుండే శక్తిగా బీఆర్ఎస్వి నిలవాలని, పార్టీ అభివృద్ధి అజెండాను యువతలో బలంగా తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. ఐక్యత, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్వి మరింత బలమైన విద్యార్థి శక్తిగా అవతరిస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.

