సంగారెడ్డి, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి): సదాశివపేట, సంగారెడ్డి పట్టణాల్లో నిర్వహించిన శ్రీ దుర్గమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సదాశివపేటలో అమ్మవారిని దర్శించుకుని హారతి సమర్పించిన ఆయన, అనంతరం పోతరాజులు, భక్తులతో కలిసి ఉత్సాహంగా చిందులు వేశారు. జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులతో మమేకమైన జగ్గారెడ్డితో చేతులు కలిపేందుకు, సెల్ఫీలు దిగేందుకు ప్రజలు ఆసక్తి చూపారు.
అనంతరం సంగారెడ్డి పాత బస్టాండ్ సమీపంలోని దుర్గమ్మ జాతర ఉత్సవాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న జగ్గారెడ్డి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శివసత్తుల రంగాన్ని ఆలకించిన అనంతరం జాతర క్రతువుల్లో పాల్గొని పోతరాజులతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో దుర్గమ్మ తల్లి జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం తెలంగాణ సంస్కృతిలో భాగమని అన్నారు. అమ్మవారి కృపతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. రానున్న ఆగస్టు 9న నిర్వహించనున్న బోనాల మహోత్సవాలను కూడా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జాతరల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయాలను పరిరక్షించడం ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు.

