వందేమాతరం గీతంతో ప్రారంభమై.. జాతీయగీతంతో ముగిసిన వేడుకలు
బిక్కనూరు, ఆగస్టు 15 (నవజ్యోతి ప్రతినిధి): బిక్కనూరు మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం దేశభక్తి ఉత్సాహం మధ్య ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్స్టేషన్, సహకార సంఘం, పాఠశాలలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో వందేమాతరం గీతం ఆలపించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి, చివరగా జాతీయగీతాన్ని ఆలపించారు.
పోలీస్స్టేషన్లో చంద్రకాంత్రెడ్డి జెండా ఆవిష్కరణ


బిక్కనూరు పోలీస్స్టేషన్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్రెడ్డి , సిఐ జగడం నరేష్, ఎస్ఐ అనిల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కార్యాలయాల్లో జెండా వందనం





బిక్కనూరు గ్రామపంచాయతీలో సర్పంచ్ రేఖ సుదర్శన్ జాతీయ జెండాను ఎగురవేశారు. సహకార సంఘం (సొసైటీ)లో చైర్మన్ గంగల్ల భూమయ్య జెండా ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీడీవో కార్యాలయంలో , జాతీయ జెండాను ఎగురవేశారు. బాలికల ఉన్నత పాఠశాలలో ఎంఈఓ మరియు ప్రధాన ఉపాధ్యాయుడు రాజగంగారెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు.
ఆకట్టుకున్న విద్యార్థుల కవాతు
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రమశిక్షణతో విద్యార్థులు చేసిన కవాతు చూపరులను ఆకట్టుకుంది. పలు పాఠశాలల్లో విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకుల వేషధారణలో అలరించారు.
మండలంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే త్రివర్ణ పతాకాలు రెపరెపలాడగా.. వందేమాతరం గీతాలు, దేశభక్తి నినాదాలతో పండుగ వాతావరణం నెలకొంది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, యువజన కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశభక్తి స్ఫూర్తితో సాగిన వేడుకలు జాతీయగీతం ఆలాపనతో ముగిశాయి.

