ఏఐ, బ్లాక్చెయిన్, క్వాంటం కంప్యూటింగ్తో పాలన ఆధునికీకరణకు ప్రభుత్వం అడుగులు…
హైదరాబాద్, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి):
రాష్ట్ర పాలనను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కాన్క్లేవ్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రభుత్వ సేవలను వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు కృత్రిమ మేధ (AI), బ్లాక్చెయిన్, డేటా అనలిటిక్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు.
బ్లాక్చెయిన్ ఆధారిత ధ్రువపత్రాల జారీ ద్వారా పౌరుల సమాచారాన్ని భద్రపరచడంతో పాటు మోసాలను అరికట్టే చర్యలు చేపడతామని చెప్పారు. టీ-ఫైబర్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ను విస్తరించి, వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే ప్రభుత్వ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ప్రభుత్వ శాఖల్లో డిజిటల్ ఆఫీస్ ప్రాజెక్టును విస్తరించి పూర్తిస్థాయి పేపర్లెస్ పాలన అమలు దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో డిజిటల్ క్యాబినెట్, 20 రంగాల రియల్టైమ్ డ్యాష్బోర్డ్, దేశంలోనే తొలి ఏఐ ఆధారిత డేటా ఎక్స్చేంజ్, వాట్సాప్ ఆధారిత పౌర సేవలు, ‘మీ టికెట్’ ప్లాట్ఫారం అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు.
సాంకేతికతకు అనుగుణంగా పాలనను నిరంతరం అభివృద్ధి చేస్తేనే సమర్థవంతమైన, పారదర్శకమైన, ప్రజాకేంద్రీకృత పరిపాలన సాధ్యమవుతుందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు.

