రూ.70 కోట్ల అదనపు నిధులు, రూ.452.05 కోట్ల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ బకాయిల విడుదలకు విజ్ఞప్తి…
న్యూఢిల్లీ, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణలో గిరిజన సంక్షేమం, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరింత ఆర్థిక సహకారం అందించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువాల్ ఓరాంను కోరారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డితో కలిసి శుక్రవారం న్యూఢిల్లీలో ఆయనను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేసి, గిరిజన సంక్షేమ పథకాల అమలుకు పూర్తి సహకారం అందించాలని మంత్రి కోరారు. ఆర్టికల్ 275(1) కింద అదనంగా రూ.70 కోట్లు, ప్రధానమంత్రి ఆది ఆదర్శ గ్రామ యోజన (PMAAGY) కింద పెండింగ్లో ఉన్న రూ.11.77 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
2024-25, 2025-26 విద్యా సంవత్సరాలకు సంబంధించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కేంద్ర వాటా బకాయిలతో పాటు 2026-27 ప్రతిపాదనలను కలిపి మొత్తం రూ.452.05 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
వినతులపై కేంద్ర మంత్రి జువాల్ ఓరాం సానుకూలంగా స్పందిస్తూ, గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన పెండింగ్ నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా రహదారుల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమం, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించగా, ఆయన అంగీకారం తెలిపినట్లు వెల్లడించారు.

