ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక చర్యలు.. అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకుల చొరవ
రామాయంపేట, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి):
పట్టణ సమీపంలోని ఎన్హెచ్-44 వై జంక్షన్ వద్ద తరచూ జరుగుతున్న ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయ్యే వరకు వై జంక్షన్ను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. ప్రమాదాల నివారణలో భాగంగా శ్రీ ఆధ్యా రోడ్, కోమటిపల్లి రోడ్లను కూడా మూసివేసే చర్యలను గురువారం నుంచి ప్రారంభించనున్నారు.
ఇటీవల వై జంక్షన్ పరిసరాల్లో వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంతో మెదక్ డీఎస్పీ, రామాయంపేట సీఐ, ఎస్ఐ, మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు, వైస్ చైర్పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, కమిషనర్ రవీందర్, కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు ప్రాంతాన్ని పరిశీలించారు. వాహనాల రాకపోకలు, రహదారి పరిస్థితులను పరిశీలించి ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
వై జంక్షన్ వద్ద శాశ్వత పరిష్కారం కోసం సుమారు రూ.47 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమై, ప్రతిపాదనకు ఆమోదం లభించిందని బీజేపీ నాయకులు తెలిపారు. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావు చొరవతో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.
వై జంక్షన్ వద్ద ప్రమాదాల నివారణకు గత కొంతకాలంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తమవంతుగా కృషి చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు కూడా సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. పోలీసు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి తాత్కాలిక చర్యలకు నిర్ణయం తీసుకున్నారు.
ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయ్యే వరకు వై జంక్షన్ను మూసివేయాలన్న అధికారుల నిర్ణయాన్ని బీజేపీ నాయకులు స్వాగతించారు. ప్రమాదాల నివారణకు తాత్కాలికంగా జంక్షన్ మూసివేయడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల రక్షణే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
వై జంక్షన్ వద్ద ప్రమాదాల నివారణ కోసం గత రెండుమూడేళ్లుగా తమ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నామని బీజేపీ నాయకులు తెలిపారు. స్థానిక తహసీల్దార్, పోలీస్ అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు జిల్లా కలెక్టర్ను పలుమార్లు కలిసి సమస్యను పరిష్కరించాలని కోరినట్లు పేర్కొన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటి వరకు జంక్షన్ను మూసివేయాలని తాము డిమాండ్ చేసినట్లు చెప్పారు.
వై జంక్షన్కు శాశ్వత పరిష్కారం లభించే వరకు ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని బీజేపీ నాయకులు తెలిపారు. జంక్షన్ మూసివేతకు చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, సీఐ, తహసీల్దార్, ఎస్ఐతో పాటు మున్సిపల్ ప్రజాప్రతినిధులు, పోలీస్, రెవెన్యూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
వై జంక్షన్ వద్ద గతంలో జరిగిన ప్రమాదాల్లో 33 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో శాశ్వత పరిష్కారంగా ఫ్లైఓవర్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. అప్పటి వరకు జంక్షన్ మూసివేతను పకడ్బందీగా అమలు చేసి ప్రమాదాలను నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో అక్కన్నపేట సర్పంచ్ బక్కయ్యగారి యాదగిరి, మాజీ సర్పంచ్ వెలుముల సిద్ధరాములు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల శేఖర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు శీలం అవినాష్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్ ప్రవీణ్, సీనియర్ నాయకులు పబ్బ సత్యం తదితరులు పాల్గొన్నారు.

