📄 ePaper
Wednesday, August 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఇంటి కోసం వెళ్లిన దంపతులపై పిట్‌బుల్‌ దాడి !

ఇంటి కోసం వెళ్లిన దంపతులపై పిట్‌బుల్‌ దాడి !

పటియాలాలో ఘటన.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స

పటియాలా, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): పంజాబ్‌లోని పటియాలాలో ఇంటిని చూసేందుకు వెళ్లిన దంపతులపై పిట్‌బుల్‌ కుక్క దాడి చేసింది. ఘుమన్‌ నగర్‌ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అద్దెకు ఉన్న ఇంటిని పరిశీలించేందుకు స్థానిక రియల్‌ ఎస్టేట్‌ డీలర్‌తో కలిసి వెళ్లిన దంపతులు ఇంటి తలుపు తట్టగా.. లోపల ఉన్న పిట్‌బుల్‌ ఒక్కసారిగా బయటకు వచ్చి వారిపై దాడి చేసింది.

మొదట మహిళపై దాడి చేసిన కుక్క.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన భర్తపైనా దాడి చేసింది. కుక్కను అదుపు చేసేందుకు రియల్‌ ఎస్టేట్‌ డీలర్‌, స్థానికులు ప్రయత్నించినా కొద్దిసేపటి వరకు దాడి కొనసాగింది. చివరకు పలువురు స్థానికులు కర్రలతో అక్కడికి చేరుకుని కుక్కను ఇంట్లోకి తరిమి గేటు మూసివేశారు. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

దంపతులకు తీవ్ర గాయాలు

దాడిలో దంపతుల శరీరంలోని పలు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వారిని పటియాలాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహిళ చేతికి తీవ్ర గాయాలైనట్లు ఘటనకు సంబంధించిన వీడియోలో కనిపించింది.

ప్రమాదకర జాతులపై ఆంక్షలు

కాగా, పిట్‌బుల్‌ వంటి ప్రమాదకర జాతుల కుక్కలను పెంచడంపై గతంలోనే నిబంధనలు, ఆంక్షలకు సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయని పటియాలా మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారి తెలిపారు. పిట్‌బుల్‌, అమెరికన్‌ బుల్‌డాగ్‌, రాట్‌వైలర్‌ వంటి ప్రమాదకర జాతుల కుక్కల విక్రయం, పెంపకం, పెంపుడు జంతువులుగా ఉంచడంపై కేంద్రం గతంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఇంటి కోసం వెళ్లినవారిపై అకస్మాత్తుగా దాడి జరగడం స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై అధికారికంగా తదుపరి చర్యల వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!