సీఎం రేవంత్ రాక నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం
నాగార్జునసాగర్, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి): ఈ నెల 10న నాగార్జునసాగర్ సమీపంలోని విజయవిహార్లో నిర్వహించనున్న వరుణ యాగం ఏర్పాట్లను నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ శుక్రవారం పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
యాగశాల, ప్రవచనశాల, టెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, బారికేడింగ్, పగోడాలు, తాగునీరు, మరుగుదొడ్లు, ఋత్వికులు, అర్చకుల వసతి, భోజన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశమున్నందున భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసు, సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
విజయవిహార్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, ఇతర మౌలిక సదుపాయాలను సమకూర్చాలని కలెక్టర్ సూచించారు.
ఈ పరిశీలనలో అదనపు ఎస్పీ రమేష్, మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి, యాదాద్రి దేవస్థానం డిప్యూటీ ఈవో డి. భాస్కర్, జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కె. భాస్కర్, డీఎస్పీ రవి, ఆర్ఐ శ్రీనివాసరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

