సంగారెడ్డి, జూలై 13 (నవజ్యోతి ప్రతినిధి): శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ బొంగులో ఉమారాణి పేర్కొన్నారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, రాష్ట్రానికి పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం అందించేందుకు వెళ్తున్న పార్టీ నాయకులపై పోలీసుల చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆమె విమర్శించారు.
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఉమారాణి మాట్లాడుతూ, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. అలాంటి శాంతియుత కార్యక్రమాలను అడ్డుకోవడం, నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు.
అరెస్టు చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం, పోలీసు శాఖను ఆమె డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం కొనసాగుతుందని, అరెస్టులతో ఉద్యమాలను అణచివేయడం సాధ్యం కాదని ఉమారాణి స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే వరకు తమ పార్టీ ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తుందని ఆమె తెలిపారు.

