- రాగి తీగలు అపహరణ.. రైతులకు సాగునీటి ఇబ్బందులు
భిక్కనూరు, జూలై 13 (నవజ్యోతి ప్రతినిధి):
బిక్కనూరు మండలం గురజకుంట గ్రామంలో గుర్తుతెలియని దుండగులు ఐదు వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, వాటిలోని రాగి తీగలు, ఇతర విలువైన పరికరాలను అపహరించారు. మిగిలిన ట్రాన్స్ఫార్మర్ల భాగాలను సమీపంలోని పంట పొలాల్లో పడేసి వెళ్లిపోయారు. ఘటనతో రైతులకు సాగునీటి సరఫరా నిలిచిపోవడంతో పంటల సాగు పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో కూడా ఇదే తరహా దొంగతనాలు జరిగినప్పటికీ నిందితులను అరికట్టడంలో విఫలమవుతున్నారని అన్నారు. రైతుల జీవనాధారమైన వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఘటనపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, గ్రామ పరిసరాల్లో రాత్రి వేళ ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటు చేయాలని సర్పంచ్ సంతోష్ రెడ్డితో పాటు గ్రామస్తులు పోలీసు అధికారులను కోరారు.

