గదులు పొంది అధిక ధరలకు విక్రయం.. సెల్ఫోన్లు స్వాధీనం..
తిరుమల, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి): తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో టీటీడీ గదులు పొందుతూ అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠాను తిరుమల II టౌన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి నకిలీ గుర్తింపు పత్రాలకు సంబంధించిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 8న తిరుమల సీఆర్వో కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా గదులు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురిని గుర్తించి విచారించగా ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఆధార్ కార్డుల్లో ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటి ఆధారంగా గదులు పొందుతున్నట్లు తేలింది. అనంతరం గదులు దొరకని భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తానికి విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడైంది.
నిందితులు బి. శ్రీనివాస్ (46), ఇరప్ప కాలప్ప (43), విష్ణు వర్ధన్ (33), అమూల్ కుమార్ సింగ్ (27), ఎస్. ప్రకాష్ (39), పి. సందీప్ (20)గా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి నకిలీ గుర్తింపు పత్రాలకు సంబంధించిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
తిరుమల పీఏసీ-5 వద్ద భక్తులు ఛార్జింగ్కు ఉంచిన రెండు సెల్ఫోన్లను చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. వాటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వ్యవహారంపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.
టీటీడీ అధికారిక కౌంటర్లు, అధికారిక ఆన్లైన్ విధానాల ద్వారానే గదులు పొందాలని పోలీసులు భక్తులకు సూచించారు. రూమ్ దళారీలను నమ్మి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి మోసపోవద్దని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే 112కు లేదా టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

