సినిమా స్టైల్లో స్కెచ్.. క్షణాల్లో మాయం.. సీసీటీవీలో చిక్కిన ముఠా…
వికారాబాద్, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి): అచ్చం సినిమా సన్నివేశాన్ని తలపించేలా తాండూరులోని ఓ నగల దుకాణంలో ఐదుగురు సభ్యుల ముఠా చాకచక్యంగా 10 గ్రాముల బంగారు గొలుసును అపహరించింది. ముగ్గురు మహిళలు బుర్ఖాలు ధరించి, ఓ పురుషుడు, ఓ బాలుడితో కలిసి కస్టమర్ల ముసుగులో దుకాణంలోకి ప్రవేశించారు.
క్రింద ఈ సీసీ కెమెరా దృశ్యాలు చూడవచ్చు 👇
నగలు కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ సిబ్బందిని మాటల్లో పెట్టగా, అదే సమయంలో మరో మహిళ షోకేస్లోని బంగారు గొలుసును ఎవరూ గుర్తించకుండా చాకచక్యంగా తీసుకుంది. క్షణాల్లో పని ముగించుకున్న ముఠా, ఏమీ జరగనట్లు దుకాణం నుంచి బయటకు వెళ్లిపోయింది.
కొద్దిసేపటి తర్వాత స్టాక్ పరిశీలించిన దుకాణ యజమానికి గొలుసు కనిపించకపోవడంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో ముఠా పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడిన దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి.
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల గుర్తింపు, వారు ప్రయాణించిన వాహనం, ఇతర జిల్లాల్లో ఇలాంటి చోరీలతో సంబంధాలపై దర్యాప్తు చేపట్టారు. ముఠాను త్వరలోనే అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.

