-
చట్టబద్ధ గడువు దాటినా స్పందించని విద్యుత్ శాఖ.. తొలి అప్పీల్కు సిద్ధమైన దరఖాస్తుదారు
భిక్కనూరు, కామారెడ్డి జూలై 29 (నవజ్యోతి ప్రతినిధి):
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ప్రకారం 30 రోజుల్లోగా సమాచారం అందించాల్సి ఉన్నప్పటికీ, భిక్కనూరు టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో నిర్వహించిన విద్యుత్ విజిలెన్స్ తనిఖీలకు సంబంధించిన వివరాల కోసం సమర్పించిన ఆర్టీఐ దరఖాస్తుకు 50 రోజులు దాటినా పూర్తి సమాచారం అందకపోవడంతో తొలి అప్పీల్ దాఖలు చేసేందుకు ఆర్టీఐ రక్షక్ ప్రతినిధి చికోటి సాయి మణికంఠ సిద్ధమయ్యారు.
భిక్కనూరు టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో నిర్వహించిన విద్యుత్ విజిలెన్స్ తనిఖీలు, లోడ్ ఎన్హాన్స్మెంట్ చర్యలు, వినియోగదారులపై తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలు కోరుతూ జూన్ 8న ఆర్టీఐ దరఖాస్తు సమర్పించారు. అయితే చట్టంలో నిర్దేశించిన 30 రోజుల గడువు ముగిసి దాదాపు 50 రోజులు గడిచినా ఇప్పటివరకు కోరిన సమాచారం అందలేదు.
ఈ విషయమై డివిజనల్ ఇంజినీర్ (డీఈ)ను పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించగా, “వస్తుంది… అవుతుంది…” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, సమాచారం ఎప్పటిలోగా అందిస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వడం లేదని చికోటి సాయి మణికంఠ ఆరోపించారు. గడువు దాటిన నేపథ్యంలో ఫాలోఅప్ చేయగా, “నన్ను బెదిరిస్తున్నావా?” అంటూ డీఈ సమాధానం దాటవేసినట్టు తెలిపారు.
మరోవైపు స్థానిక అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)ను వివరణ కోరగా, ఆర్టీఐలో కోరిన వివరాలను తమ కార్యాలయం నుంచి సంబంధిత ఉన్నతాధికారులకు ఇప్పటికే పంపించినట్లు తెలిపారు. తమ స్థాయి నుంచి పంపాల్సిన సమాచారం పంపించామని, తదుపరి స్థాయిలోనే జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.
ఒకవైపు సమాచారం పంపించామని అధికారులు చెబుతుండగా, మరోవైపు చట్టబద్ధ గడువు దాటినా దరఖాస్తుదారునికి సమాచారం అందకపోవడం శాఖల మధ్య సమన్వయ లోపాన్ని బహిర్గతం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం తొలి అప్పీల్ దాఖలు చేయనున్నట్లు ఆర్టీఐ రక్షక్ ప్రతినిధి చికోటి సాయి మణికంఠ తెలిపారు.

