- సాగునీటి పనులపై ప్రత్యేక సమీక్ష..
- అధికారులకు ఎమ్మెల్యే కీలక ఆదేశాలు…
మిర్యాలగూడ, జూలై 13 (నవజ్యోతి ప్రతినిధి) మిర్యాలగూడ నియోజకవర్గ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మిర్యాలగూడలోని ఎమ్మెల్యే శిబిర కార్యాలయంలో సాగునీటి శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతున్న సాగునీటి పనుల పురోగతి, వివిధ ప్రాజెక్టుల స్థితిగతులు, పెండింగ్లో ఉన్న పనులు, రైతుల అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన కొత్త సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని చెరువులను పూర్తిస్థాయిలో నింపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో బావులు, బోరు బావుల్లో భూగర్భ జలమట్టం నిలకడగా ఉండటానికి ఉపయోగపడుతుందని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రతి పనిని నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో చేపట్టాల్సిన కొత్త సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అనంతరం సాగునీటి శాఖ అధికారులతో కలిసి మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో రూ.11 కోట్ల వ్యయంతో చేపడుతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని స్వయంగా తనిఖీ చేసి, ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సాగు సీజన్ను దృష్టిలో ఉంచుకుని కాలువ మరమ్మత్తులను త్వరితగతిన పూర్తిచేసి, రైతులకు సకాలంలో సాగునీరు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వ్యవసాయాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి రాజీ ఉండదని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి రైతుకు మెరుగైన సాగునీటి సౌకర్యం కల్పించే దిశగా అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సాగునీటి శాఖ పర్యవేక్షణ అధికారి ఎస్.సి. మల్లికార్జునరావు, కార్యనిర్వాహక ఇంజినీర్లు గోపినాథ్, మనోహర్, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు, సహాయ ఇంజినీర్లు, కనిష్ఠ ఇంజినీర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.


