- నిర్మాణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్.. నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశం.
రామాయంపేట, జూలై 26 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) :
రామాయంపేట, ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది.ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చొరవ,కృషి ఫలితంగా రామాయంపేట పట్టణంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరైంది. ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ నిర్మాణ స్థలాన్ని సందర్శించి పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా పాఠశాల నిర్మాణ నమూనా (లేఔట్ మ్యాప్)ను పరిశీలించిన కలెక్టర్, నిర్మాణ విధానాలు, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే ప్రస్తుతం ఉన్న కార్మికుల సంఖ్యను పెంచి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా వేలాది మంది విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుందని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాలను ప్రారంభించేలా అన్ని చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
ఈ విద్యా ప్రాజెక్టు మెదక్ నియోజకవర్గ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పాఠశాల మంజూరు కోసం ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కి ప్రజలు, స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

