ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానం.. పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహం
హైదరాబాద్, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): మైనారిటీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించే కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఆగస్టు 13న ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి చేతుల మీదుగా గ్రూప్-1, గ్రూప్-2, ఐఐటీ–జేఈఈ, టీజీ ఈఏపీసెట్ తదితర పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన టాపర్లతో పాటు TGMREISలో ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించనున్నారు.
కార్యక్రమ ఏర్పాట్లపై మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ సచివాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ సమావేశానికి హాజరై ఏర్పాట్లపై చర్చించారు. TGMREIS అధ్యక్షుడు ఫహీమ్ ఖురేషీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇటీవల TGMREIS ఎస్ఎస్సీ ఫలితాల్లో మొహద్. రేహాన్ 589 మార్కులతో అగ్రస్థానాల్లో నిలిచారు. మైమూనా మదీహా 583 మార్కులతో టాప్-10లో చోటు దక్కించుకున్నారు.
రేపటి కార్యక్రమంలో విద్యార్థులను సన్మానించడంతో పాటు వారి ప్రతిభను గుర్తించి ఉన్నత విద్య, పోటీ పరీక్షల వైపు మరింత ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం దృష్టి సారించనుంది.

