రెస్ట్రూమ్లో ఉరేసుకున్న కానిస్టేబుల్.. మృతదేహంపై గాయాలున్నాయంటున్న కుటుంబ సభ్యులు, పోలీసులతో వాగ్వాదం !
హైదరాబాద్, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ జె. సాయికుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారు. 2024 బ్యాచ్కు చెందిన సాయికుమార్ (PC 13128) ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ-కాప్స్ డ్యూటీ కోసం ఏసీపీ కార్యాలయానికి అటాచ్ అయ్యారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో కార్యాలయంలోని రెస్ట్రూమ్లో ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తోటి సిబ్బంది గుర్తించి వెంటనే సాయికుమార్ను కామినేని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కర్మన్ఘాట్లో స్నేహితులతో కలిసి సాయికుమార్ నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
సాయికుమార్ మృతిపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని తరలించడంపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. సాయికుమార్ మృతికి గల కారణాలను పూర్తిగా వెల్లడించాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులకు–పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
సాయికుమార్ మృతదేహంపై గాయాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసి.. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. అయితే ఈ ఆరోపణలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఆందోళన నేపథ్యంలో ఏసీపీ కార్యాలయంలో ఫర్నిచర్, కంప్యూటర్లు ధ్వంసమైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పరిస్థితులపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయికుమార్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలు, కార్యాలయంలో చోటుచేసుకున్న పరిణామాలపై విచారణ కొనసాగుతోంది.

