రహస్య క్లాసులు.. ఆస్పత్రిలో బట్టీ.. టెలిగ్రామ్లో ప్రశ్నల అమ్మకం.. సీబీఐ ఛార్జ్షీట్లో సంచలన విషయాలు..
న్యూఢిల్లీ, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి): నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)కు చెందిన ప్రశ్నపత్రాల అనువాదం, ప్రూఫ్రీడింగ్ బాధ్యతలు నిర్వహించిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులే భారీ మొత్తాలకు ప్రశ్నలను లీక్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.
సీబీఐ వివరాల ప్రకారం.. పుణెలో రహస్యంగా నిర్వహించిన ప్రత్యేక రివిజన్ క్లాసుల్లో అభ్యర్థులకు అసలు ప్రశ్నలు, నాలుగు ఎంపికలు, సరైన సమాధానాలను మౌఖికంగా చెప్పి నోట్బుక్స్లో రాయించారు. ఫిజిక్స్ ప్రశ్నలను చేతిరాతలో సిద్ధం చేసి వాటి ఫొటోలు తీసి టెలిగ్రామ్ ద్వారా ఇతరులకు పంపించినట్లు గుర్తించారు.
లాతూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఎంపిక చేసిన అభ్యర్థులను తీసుకెళ్లి లీకైన ప్రశ్నలను బట్టీ పట్టించినట్లు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. దర్యాప్తులో నగదు, డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా లభించినట్లు వెల్లడించారు.
మహారాష్ట్ర నుంచి గురుగ్రామ్, అక్కడి నుంచి జైపూర్ వరకు టెలిగ్రామ్ ద్వారా ప్రశ్నల పీడీఎఫ్లు చేరగా, వాటిని ప్రింట్ చేసి కోచింగ్ సెంటర్ల ద్వారా అభ్యర్థులకు పంపిణీ చేసినట్లు సీబీఐ గుర్తించింది.
దాడుల్లో స్వాధీనం చేసుకున్న చేతిరాత నోట్స్ను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించగా, అవి మే 3న నిర్వహించిన అసలు నీట్ ప్రశ్నపత్రంతో పూర్తిగా సరిపోలినట్లు నిర్ధారణ అయింది. ఈ కేసులో 360 మంది సాక్షులు, 422 పత్రాలు, 43 భౌతిక ఆధారాల ఆధారంగా సీబీఐ ఇప్పటికే 13 మంది నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వారిపై కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టంతో పాటు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) చట్టం-2024 కింద కేసులు నమోదు చేసింది.
ప్రశ్నపత్రం లీక్ వెలుగులోకి రావడంతో మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను రద్దు చేసి, జూన్ 21న దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

