ఐఫోన్, కత్తి ఆచూకీపై ప్రశ్నల వర్షం.. ప్రేమ వ్యవహారంపైనా ఆరా
హైదరాబాద్, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి):
జాతీయ పోలీస్ అకాడమీ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై నమోదైన కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు గురువారం సుదీర్ఘంగా విచారించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సీపీ సజ్జనార్ పర్యవేక్షణలో దాదాపు ఐదు గంటలపాటు విచారణ కొనసాగింది.
విచారణలో కేసుకు సంబంధించిన కీలక ఆధారాలైన మాయమైన ఐఫోన్, ఘటనలో ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్న కత్తిని ఎక్కడ పడేశావని అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే పలు ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి నేరుగా సమాధానాలు ఇవ్వకుండా దాటవేసే ధోరణి ప్రదర్శించినట్లు సమాచారం.
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారితో ఉన్న వ్యక్తిగత పరిచయం, ఇద్దరి మధ్య ఉన్న సంబంధం, ఫోన్ కాల్స్, చాట్లు, వ్యక్తిగత భేటీలపై కూడా పోలీసులు ఆరా తీసినట్లు తెలిసింది. డిజిటల్ ఆధారాలు, మొబైల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులను పరిశీలిస్తూ విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే కేసులో లైంగిక వేధింపులు, దాడి, బెదిరింపులు, రహస్యంగా వీడియో చిత్రీకరణ, బ్లాక్మెయిల్ తదితర ఆరోపణలు నమోదైన విషయం తెలిసిందే. ఫిర్యాదులో పేర్కొన్న ప్రతి అంశాన్ని విడివిడిగా ధృవీకరించే దిశగా దర్యాప్తు కొనసాగుతోందని తెలుస్తోంది.
విచారణలో లభించే డిజిటల్ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు, స్వాధీనం చేసుకునే వస్తువుల ఆధారంగా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

