మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.
పారిశుధ్యానికి పెద్దపీట వేస్తాం : సర్పంచ్
అభివృద్ధి పనులకు నిధుల సద్వినియోగం
రామాయంపేట,ఆగస్టు18 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్) :
గ్రామంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా అండర్ డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు.రామాయంపేట మండలంలోని కాట్రియాల గ్రామం లో సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా ఆధ్వర్యంలో అండర్ డ్రైనేజ్ పనులను ప్రారంభించారు.
గ్రామపంచాయతీ నుంచి రూ.5 లక్షలు,VBGRAMG పథకం ద్వారా రూ.10 లక్షలు కలిపి మొత్తం రూ.15 లక్షలతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు.గ్రామంలోని పలు ప్రాంతాల్లో మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పనులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
అండర్ డ్రైనేజీ నిర్మాణంతో మురుగునీరు సక్రమంగా వెళ్లడంతో పాటు పారిశుధ్య సమస్యలు తగ్గుతాయని తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.గ్రామ అభివృద్ధికి అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని సర్పంచ్ తెలిపారు. డ్రైనేజీ పనులు పూర్తయితే వర్షాకాలంలో నీటి నిల్వలు, దోమల బెడద తగ్గి గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సభావత్ బాబు,కార్యదర్శి ధనలక్ష్మి,వార్డు సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

