2026-27 విద్యా సంవత్సరం నుంచే అమలు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…
హైదరాబాద్, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి): నారాయణపేట జిల్లా కోస్గిలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) పరిధిలోని రాజ్యాంగ కళాశాలగా (Constituent Engineering College) మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల పరిపాలనా నియంత్రణను జేఎన్టీయూహెచ్కు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పు 2026-27 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది.
కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్థిక శాఖ ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ను ఆదేశించింది.
ఈ నిర్ణయంతో కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలకు జేఎన్టీయూహెచ్ ప్రత్యక్ష పరిపాలన, అకడమిక్ పర్యవేక్షణ లభించనుండగా, విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, పరిశోధన అవకాశాలు మరింత మెరుగుపడే అవకాశం ఉందని విద్యావర్గాలు భావిస్తున్నాయి.

