- నాలుగు గంటల్లోనే గుర్తించిన భిక్కనూరు పోలీసులు.. తల్లిదండ్రులకు అప్పగింత…
భిక్కనూరు, జూలై 16 (నవజ్యోతి ప్రతినిధి):
కామారెడ్డి జిల్లా భిక్కనూరు సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాల నుంచి ఐదో తరగతి విద్యార్థి తప్పించుకోవడం బుధవారం కలకలం రేపింది. పోలీసులు వేగంగా స్పందించి నాలుగు గంటల వ్యవధిలోనే బాలుడిని సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన కే. రుత్విక్ ఆశ్రమ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. ఉదయం ప్రార్థన అనంతరం మూత్ర విసర్జనకు వెళ్తున్నట్లు చెప్పి బయటకు వెళ్లిన బాలుడు, ప్రహరీ గోడ దూకి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయం ఆలస్యంగా గుర్తించిన పాఠశాల సిబ్బంది భిక్కనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఐ జగడం నరేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు, క్రైమ్ పార్టీ పోలీసులు రైల్వే స్టేషన్తో పాటు పరిసర గ్రామాల్లో గాలింపు చేపట్టారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో బాలుడి స్వగ్రామంలోని పాఠశాలకు వెళ్లగా, అక్కడ ఐదో తరగతి గదిలో ప్రశాంతంగా పాఠాలు వింటూ కనిపించాడు. వెంటనే బాలుడిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారించగా, ఆశ్రమ పాఠశాలలో ఉండి చదవడం ఇష్టం లేక స్వగ్రామ పాఠశాలకు వెళ్లినట్లు తెలిపాడు.
బాలుడిని అనంతరం తల్లిదండ్రులకు అప్పగించగా, మిస్సింగ్ ఘటనకు సుఖాంతం లభించింది. ఈ ఘటనతో ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, పర్యవేక్షణపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

