- పునర్నిర్మాణ కమిటీ పర్యవేక్షణలో ప్రశాంతంగా సాగిన దర్శనం..
బిక్కనూరు, జూలై 14 (నవజ్యోతి ప్రతినిధి):
ఆరుద్ర నక్షత్రం, చతుర్దశి, సోమవారం ఒకే రోజు రావడంతో బిక్కనూరులోని శ్రీ సిద్ధరామేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం, ఆరుద్ర నక్షత్రం ఒకే రోజు రావడం విశేషంగా భావించిన భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆరుద్ర నక్షత్రంలో పరమశివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే శుభఫలితాలు, కుటుంబ సౌఖ్యం, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని విశ్వాసంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ అర్చకులు కొనకండ్ల రామగిరి శర్మ, రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు కమిటీ సభ్యులందరూ ఆలయ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనం, క్యూలైన్ల నిర్వహణ, తీర్థప్రసాదాల పంపిణీలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. వారి సమన్వయంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనం ప్రశాంతంగా సాగగా, ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

