12 మంది సీనియర్లు కర్రలు, ప్లేట్లతో కొట్టారని తల్లిదండ్రుల ఆరోపణ.. ఆసుపత్రిలో చికిత్స
హైదరాబాద్, ఆగస్టు 10 (నవజ్యోతి ప్రతినిధి): దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్ హాస్టల్లో పదో తరగతి విద్యార్థి అభిషేక్పై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. సుమారు 12 మంది విద్యార్థులు కర్రలు, ప్లేట్లతో దాడి చేశారని అభిషేక్ తల్లిదండ్రులు ఆరోపించారు.
తమ కుమారుడిని బూట్లతో ముఖంపై తన్నడంతో పాటు తీవ్రంగా కొట్టారని తల్లిదండ్రులు తెలిపారు. అనంతరం మెట్లపై నుంచి పడిపోయాడని పాఠశాల యాజమాన్యం తమకు ఫోన్లో సమాచారం ఇచ్చిందన్నారు. ప్రస్తుతం అభిషేక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సీనియర్ విద్యార్థులు రాగింగ్ పేరుతో తనపై దాడి చేశారని అభిషేక్ చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన పాఠశాల యాజమాన్యంపైనా, దాడికి పాల్పడిన విద్యార్థులపైనా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
దాడి జరిగిన తీరు, బాధ్యులెవరనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

