సంగారెడ్డి, జూలై 31 (నవజ్యోతి న్యూస్): రోబోటిక్ సర్జరీ సాంకేతికత క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందని యశోద ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ గౌడ్ తెలిపారు. సంగారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ సంప్రదాయ శస్త్రచికిత్సలతో పోలిస్తే రోబోటిక్ విధానంలో అత్యంత కచ్చితత్వంతో ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు రోగులకు నొప్పి, రక్తస్రావం, కోలుకునే సమయం గణనీయంగా తగ్గుతుందని వివరించారు.
రోబోటిక్ పద్ధతిలో కేవలం 8 మిల్లీమీటర్ల చిన్న రంధ్రాల ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహించడం వల్ల శరీరంపై గాయాలు తక్కువగా ఉంటాయని, కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత, త్రీడీ విజన్, ప్రత్యేక పరికరాల సహాయంతో క్లిష్టమైన క్యాన్సర్ శస్త్రచికిత్సలను కూడా విజయవంతంగా చేయగలుగుతున్నామని చెప్పారు.
మహిళల్లో గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్, కిడ్నీ, కోలోరెక్టల్, ఊపిరితిత్తుల క్యాన్సర్ల చికిత్సలో రోబోటిక్ సర్జరీ సమర్థవంతమైన ఫలితాలు ఇస్తోందన్నారు. ముఖ్యంగా నరాలను సంరక్షించడం, మూత్ర నియంత్రణ, శారీరక సామర్థ్యాన్ని కాపాడడంలో ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఫైర్ఫ్లై ఫ్లోరోసెన్స్ ఇమేజింగ్, సెంటినెల్ లింఫ్ నోడ్ మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో క్యాన్సర్ కణాలను మరింత ఖచ్చితంగా గుర్తించే అవకాశం ఉందని తెలిపారు. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, త్వరగా కోలుకోవడం, ఆస్పత్రిలో తక్కువ రోజులు ఉండాల్సి రావడం వంటి ప్రయోజనాల వల్ల రోబోటిక్ క్యాన్సర్ శస్త్రచికిత్సలపై రోగుల్లో విశ్వాసం పెరుగుతోందని డాక్టర్ రాజేష్ గౌడ్ వెల్లడించారు.

