డిపో మేనేజర్కు సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్ వినతి…
భిక్కనూర్, ఆగస్టు 1 (నవజ్యోతి ప్రతినిధి):
భిక్కనూర్ మండల కేంద్రంలోని ప్రయాణికుల ప్రాంగణంలో మూతపడిన మరుగుదొడ్లను వెంటనే అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు పల్లె వెలుగు బస్సులు నడపాలని గ్రామ సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్ కామారెడ్డి డిపో మేనేజర్ ప్రదీప్కు వినతిపత్రం పంపించారు.
భిక్కనూర్ బస్టాండ్ నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతుందని, హైదరాబాద్తో పాటు కామారెడ్డి, నిజామాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది ప్రధాన రవాణా కేంద్రంగా మారిందని ఆమె వినతిపత్రంలో పేర్కొన్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారుల సౌకర్యార్థం గతంలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు ప్రస్తుతం మూతపడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే వాటిని మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
అలాగే ఉదయం వేళల్లో కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం 8.00 గంటలకు, 8.30 గంటలకు భిక్కనూర్ నుంచి అదనపు పల్లె వెలుగు బస్సులు నడపాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా హైదరాబాద్ నుంచి కామారెడ్డి మార్గంలో ఉదయం 6.00 గంటల నుంచి 6.30 గంటల మధ్య అదనపు బస్సులు ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఎంతో ఊరట కలుగుతుందని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
సర్పంచ్ రేఖ సుదర్శన్ సూచనల మేరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, సిద్ధరామేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ లింబాద్రి, కాంగ్రెస్ నాయకులు రాజబాబు, విజయ్ కలిసి కామారెడ్డి డిపో మేనేజర్ ప్రదీప్కు వినతిపత్రాన్ని అందజేశారు.

