- భూములు, తాగునీరు, గిరిజన తండాలు, మౌలిక వసతులపై చర్యలు కోరిన మదన్ మోహన్…
కామారెడ్డి, జూలై 16 (నవజ్యోతి ప్రతినిధి):
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గురువారం జిల్లా కలెక్టర్ను కలిసి నియోజకవర్గంలోని పలు అత్యవసర సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందజేశారు. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం, మల్తుమ్మెద గ్రామాల రైతులకు పెండింగ్లో ఉన్న పట్టా పాస్ పుస్తకాలు అందజేయాలని, గిరిజన తండాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉన్న అటవీశాఖ అభ్యంతరాలను పరిష్కరించాలని కోరారు.
అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, ప్రతి మండలంలో గోదాముల కోసం ప్రభుత్వ భూమి కేటాయింపు, నాగిరెడ్డిపేటలో సమీకృత మండల కార్యాలయ సముదాయం, మినీ స్టేడియం కోసం భూమి కేటాయింపు, తాగునీటి సమస్యల నివారణ, బొల్లారం–లింగోజిపల్లి పోచమ్మ ఆలయం వరకు మెటల్ రోడ్డు నిర్మాణానికి అటవీ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రంలోని అంశాలను పరిశీలించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.

