టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 8,977 కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు.. అర్హత కలిగిన కేంద్రాల్లో 100 శాతం విద్యుదీకరణ..
హైదరాబాద్, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): మహిళలు, చిన్నారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాల విద్యుదీకరణ పూర్తయింది. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సౌకర్యం లేని 9,234 అంగన్వాడీ కేంద్రాలను గుర్తించగా.. 257 కేంద్రాలు అవసరం లేనివి, విలీనమైనవి, ఉనికిలో లేనివి లేదా గుర్తించలేనివిగా తేలాయి. మిగిలిన 8,977 అర్హత కలిగిన కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు అందించి 100 శాతం విద్యుదీకరణ పూర్తి చేశారు.
డీఏ–జీజీయూఏ పథకం కింద ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో చేపట్టారు. మొదటి దశలో గుర్తించిన 7,297 కేంద్రాల్లో 7,073 కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి జూలైలో పనులు పూర్తి చేశారు. రెండో దశలో గుర్తించిన 1,937 కేంద్రాల్లో 1,904 కేంద్రాలకు కనెక్షన్లు అందించి ఈ నెల 10న పనులు పూర్తి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు టీజీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో చిన్నారులకు మెరుగైన అభ్యసన వాతావరణం, మహిళలు–చిన్నారులకు అందించే ఆరోగ్య, పోషకాహార సేవలకు మెరుగైన సదుపాయాలు కలగనున్నాయి. అంగన్వాడీ సిబ్బందికి కూడా మెరుగైన పని వాతావరణం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.
టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ ఐఏఎస్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల సమగ్ర అభివృద్ధితో పాటు గర్భిణులు, బాలింతలకు కీలక సేవలు అందిస్తున్నాయని తెలిపారు. విద్యుత్ సౌకర్యంతో ఆయా కేంద్రాల పనితీరు మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేసిన చీఫ్ ఇంజినీర్లు, ఎస్ఈలు, డీఈలు, ఏఈలు, లైన్ సిబ్బంది, ఇతర ఉద్యోగులను సీఎండీ అభినందించారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు నాణ్యమైన విద్యుత్ మౌలిక వసతుల ద్వారా టీజీఎస్పీడీసీఎల్ నిరంతరం సహకరిస్తుందని సీఎండీ తెలిపారు.

