ఆగస్టు 17 నుంచి మండల ప్రజావాణి.. 560 మంది ఎంపీడీవోలకు శిక్షణ…
హైదరాబాద్, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని ఆశ్రయిస్తున్నందున అధికారులు బాధ్యతతో
పనిచేయాలని రాష్ట్రస్థాయి ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
డాక్టర్ జి. చిన్నారెడ్డి సూచించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో
ప్రజావాణి మండల నోడల్ అధికారులుగా నియమితులైన 560 మంది ఎంపీడీవోలకు
నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రజలు యజమానులని, అధికారులు ప్రజాసేవకులనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
గ్రామాల నుంచి వచ్చే ప్రజల సమస్యలను ఓపికగా విని, దరఖాస్తులు స్వీకరించి
సాధ్యమైనంత వరకు క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని సూచించారు.
సీఎం రేవంత్రెడ్డి తమపై ఉంచిన నమ్మకాన్ని ఎంపీడీవోలు నిలబెట్టుకోవాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా తొలిసారిగా ఆగస్టు 17 నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలు
ప్రారంభమవుతాయని చిన్నారెడ్డి తెలిపారు. శాఖల వారీగా సహాయ, ఫిర్యాదు కేంద్రాలు,
దరఖాస్తులు రాయడానికి సహాయక డెస్క్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సహాయం అందించాలని ఆదేశించారు.
రాష్ట్రస్థాయి ప్రజావాణిలో 75 శాతం ఫిర్యాదులు పరిష్కారమవుతున్నాయని
తెలిపారు. మండల స్థాయిలోనూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు.
రాష్ట్ర నోడల్ అధికారి కె. విద్యాసాగర్ మాట్లాడుతూ అధికారులు ప్రజలకు
అందుబాటులో ఉండి, ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా పరిష్కారం అయ్యే వరకు బాధ్యత
తీసుకోవాలన్నారు.
సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు ప్రజావాణికి వచ్చే వారి సమస్యలను
ఓపికగా విని భరోసా కల్పించాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల
కమిషనర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఓపికగా
వినడమే సగం పరిష్కారమన్నారు.
శిక్షణలో కీలక అంశాలు: మండల ప్రజావాణి నిర్వహణ, ఫిర్యాదుల నమోదు,
పరిష్కార ప్రక్రియ, శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై నిపుణులు పవర్పాయింట్
ప్రజెంటేషన్ల ద్వారా అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ప్రణాళికా శాఖ డైరెక్టర్ షేక్ మీరా, సీఎం ప్రజావాణి
ఏసీపీ ఉమేందర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు,
సీజీజీ అధికారి సుశీల తదితరులు పాల్గొన్నారు.

