రూ.3.36 లక్షల విలువైన గ్రానైట్, గర్భగుడి టైల్స్ సమకూర్చిన ముద్దసాని రాజు కుటుంబం.. దాతలను సన్మానించిన గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి
బిక్కనూర్, ఆగస్టు 2 (నవజ్యోతి ప్రతినిధి): బిక్కనూర్ మండలం రామేశ్వర్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న శ్రీరామాలయానికి ప్రముఖ వ్యాపారవేత్త, గ్రామానికి చెందిన ముద్దసాని రాజు–మాలతి దంపతులు, వారి కుమార్తె వర్షిత, కుమారుడు రోహన్ కలిసి ఆలయ నిర్మాణానికి అవసరమైన రూ.3.36 లక్షల విలువైన గ్రానైట్, గర్భగుడికి అవసరమైన టైల్స్ను సమకూర్చారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి విశేష సహకారం అందించిన ముద్దసాని రాజు కుటుంబ సభ్యులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆలయ నిర్మాణానికి భక్తిశ్రద్ధలతో నిర్మాణ సామగ్రిని అందించిన ముద్దసాని కుటుంబం సేవాభావం ఆదర్శనీయమన్నారు. శ్రీరాముని కృపాకటాక్షాలు వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలకు మరిన్ని కుటుంబాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అంకం రాజు పాటిల్తో పాటు గ్రామ పెద్దలు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

