650 ఏళ్ల చరిత్ర కలిగిన దత్తలయ్య గుట్ట క్షేత్రంలో ప్రత్యేక పూజలు
సంగారెడ్డి, జూలై 27 (నవజ్యోతి ప్రత్యేక ప్రతినిధి):
హత్నూర మండలం సమీపంలోని ప్రసిద్ధ పురాతన దత్తలయ్య గుట్టలో వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామి క్షేత్రాన్ని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ సభాపతి శర్మ ఆధ్వర్యంలో పూజారులు చంద్రప్రకాష్ శర్మ, సూర్యప్రకాష్ శర్మ వేదమంత్రోచ్చారణల మధ్య అర్చనలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ మర్యాదలతో బండారు యాదగిరిని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా బండారు యాదగిరి మాట్లాడుతూ, దత్తలయ్య గుట్ట క్షేత్రానికి సుమారు 650 సంవత్సరాల చారిత్రక వైభవం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది గురుపౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తారని తెలిపారు. ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఈ క్షేత్రంలో స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందన్నారు.
ఇదిలా ఉండగా, గురుపౌర్ణమి బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజ, చండీ హోమం, దీపప్రజ్వలన అనంతరం శ్రీ దత్తాత్రేయ స్వామివారికి మహాభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. గురుపౌర్ణమి రోజున తెల్లవారుజాము నుంచే విశేష పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ సభాపతి శర్మ తెలిపారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మాజీ ప్రధాన కార్యదర్శి పానుగంటి కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు శివన్న జైన్, వెన్న చక్రేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

