చౌటకూర్, జూలై 24 (నవజ్యోతి ప్రతినిధి) :
చౌటకూర్ మండల కేంద్రంలో రూ.35.50 కోట్ల వ్యయంతో ట్రైబల్ లా కాలేజీ మంజూరు చేయించిన రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహకు గిరిజన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చౌటకూర్ మండల మాజీ ఎంపీపీ సుభాష్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, కుమారి సాయిలుతో కలిసి గిరిజన నాయకులు మంత్రిని కలిసి అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ, గిరిజన యువత న్యాయ విద్యను అభ్యసించి న్యాయ రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశాలను కల్పించే లక్ష్యంతో ట్రైబల్ లా కాలేజీని మంజూరు చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ఈ కళాశాల ద్వారా గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు లభించి వారి భవిష్యత్తు మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. అందోల్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ప్రజల సంక్షేమం, గిరిజనుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహకు గిరిజన సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సరపల్లి రామచందర్ రెడ్డి, సాయిలు, హరిసింగ్, గోపాల్, రాములు, మేఘరాజ్ నాయక్, మహేష్ రాథోడ్, గణేష్ జాదవ్, కిషన్ డీలర్, దుర్వాష్, జైల్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

