- జీవో నెం.01ను ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి
- రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి
సంగారెడ్డి, జూలై 4 (నవజ్యోతి ప్రతినిధి):
ప్రభుత్వ జీవో నెం.01 అమలులో తీవ్ర నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ ఉమారాణి ఆరోపించారు. అక్రమ ఫీజుల పేరిట తల్లిదండ్రులను ఆర్థికంగా దోపిడి చేస్తున్న పాఠశాలలపై ప్రభుత్వం వెంటనే ప్రత్యేక తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
శనివారం సంగారెడ్డిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రుల కమిటీలను ఏర్పాటు చేయకుండా,ఫీజుల వివరాలను బహిరంగంగా ప్రదర్శించకుండా,పేరెంట్స్ సమావేశాలు నిర్వహించకుండా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని విమర్శించారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చి వేలాది కుటుంబాలపై అధిక ఫీజుల భారం మోపుతున్నారని అన్నారు.
జీవో నెం.01ను కచ్చితంగా అమలు చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఫీజుల నియంత్రణకు పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో విద్యారంగాన్ని సమర్థంగా నడిపించేందుకు పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని ఉమారాణి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పద్మ, శోభ, గౌస్ పాషా, గీత తదితరులు పాల్గొన్నారు.

