మెదక్ జూలై 4 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) :
కాజిపల్లి రోడ్డుపై విద్యార్థులతో కలిసి యూఎస్ఎఫ్ఐ ధర్నా
ఉదయం 9 గంటల స్కూల్కు 10 గంటలకు చేరుతున్న విద్యార్థులు
డీఎం వెంటనే స్పందించి బస్సుల సమయాలను సరిచేయాలి: యూఎస్ఎఫ్ఐ.
బస్టాండ్ లేక వర్షంలో తడుస్తున్న విద్యార్థులు.. ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి.
మెదక్ మండలంలోని రాజుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సమయానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో శనివారం కాజిపల్లి రోడ్డుపై విద్యార్థులతో కలిసి యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జగన్ పాల్గొని విద్యార్థుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు పాఠశాల ప్రారంభమైనప్పటికీ, ఆర్టీసీ బస్సులు ఆలస్యంగా రావడంతో విద్యార్థులు ఉదయం 10 గంటల తర్వాతే పాఠశాలకు చేరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మొదటి పీరియడ్తో పాటు ముఖ్యమైన పాఠాలు కోల్పోతున్నారని తెలిపారు. విద్యార్థుల విద్యాభ్యాసంపై ఈ సమస్య తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు.అలాగే, రాజుపల్లి ప్రాంతంలో సరైన బస్టాండ్ సౌకర్యం కూడా లేకపోవడంతో విద్యార్థులు ఎండ, వర్షాలను లెక్కచేయకుండా రోడ్డుపైనే బస్సుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. వర్షాకాలంలో విద్యార్థులు పూర్తిగా తడుస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.జిల్లా ఆర్టీసీ డీఎం వెంటనే స్పందించి విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బస్సులను సమయానికి నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు బస్టాండ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు
.

