- వర్షపు నీటిని ఒడిసిపట్టడమే జలసిరి లక్ష్యం
- ప్రతి ఇంటికి ఇంకుడు గుంత–ప్రతి పొలానికి పంట గుంట – ప్రత్యేక అధికారి సాహితి
మాడుగులపల్లి, జూలై 28 (నవజ్యోతి ప్రతినిధి) జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ జలసిరి, జలసంచాయి, జన్ భాగీదారి మరియు వీబీజీ రాంజీ పథకాల కింద చేపడుతున్న నీటి సంరక్షణ పనులను వేగవంతంగా అమలు చేయాలని మండల ప్రత్యేక అధికారి సాహితి అధికారులకు సూచించారు. మంగళవారం మాడుగులపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సహాయ ఇంజనీర్లు, వీబీజీ రాంజీ సిబ్బందితో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సాహితి మాట్లాడుతూ, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత – ప్రతి పొలానికి పంట గుంట – ప్రతి ఊరికి ఊట గుంట అనే నినాదంతో గ్రామాల్లో నీటి సంరక్షణ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. భూగర్భ జలాల మట్టాలను పెంపొందించే లక్ష్యంతో ప్రతి గ్రామంలో ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. వీబీజీ రాంజీ పథకం కింద చేపడుతున్న పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, వర్షపు నీటిని ఒడిసిపట్టే చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. వంశీధర్, మండల పంచాయతీ అధికారి టి. సంగీత, పంచాయతీరాజ్ ఏఈఈ ఎల్. మధు, ఆర్డబ్ల్యూఎస్ ఏఏఈ ప్రసాద్, ఏపీఓ శ్రీనివాసరెడ్డి, సెర్ప్ ఏపీఎం మధు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

