– పటాన్చెరులో టీయూడబ్ల్యూజే–ఐజేయూ సర్వసభ్య సమావేశం
– ఇంటి స్థలాలు, ఆరోగ్య కార్డులు, అక్రిడిటేషన్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
పటాన్చెరు, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి): జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం మంగళవారం రామచంద్రాపూర్లోని లక్ష్మీ గార్డెన్స్లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, యూనియన్ బలోపేతం, సంక్షేమ కార్యక్రమాలపై నాయకులు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే యూనియన్ ప్రధాన ఎజెండా అని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. యూనియన్ బలోపేతానికి ప్రతి సభ్యుడు భాగస్వామి కావాలని, జర్నలిస్టుల సమస్యలపై సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులు అనేక సమస్యల మధ్య విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం ప్రాధాన్యతతో పరిష్కరించాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని, కుటుంబాలకు ఉపయోగపడే విధంగా ఆరోగ్య కార్డులు అందించాలని డిమాండ్ చేశారు.
అర్హత ఉన్నప్పటికీ ఇంకా అక్రిడిటేషన్ కార్డులు అందని జర్నలిస్టులు ఉన్నారని, వారందరికీ నిబంధనల మేరకు కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. చిన్న, మధ్య తరహా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో జర్నలిస్టులు సహా అన్ని విభాగాల్లో పనిచేస్తున్న పాత్రికేయుల సమస్యలను సమానంగా పరిగణించాలని అభిప్రాయపడ్డారు.
జర్నలిస్టుల మధ్య ఐక్యత ఉంటేనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. యూనియన్ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రతి జర్నలిస్టుకు అండగా నిలిచేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం విషయంలో సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే. పైసల్ మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు యూనియన్ నిరంతరం కృషి చేస్తుందన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఆరోగ్య కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, యూనియన్ను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో , జిల్లా కమిటీ నాయకులు, కార్యవర్గ సభ్యులు మాట్లాడి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్, ప్రెస్క్లబ్ల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు పాల్గొని జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమంపై తమ సూచనలు చేశారు.

