కుత్బుల్లాపూర్, జూలై 19: (నవజ్యోతి ప్రతినిధి)దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట శ్రీ బాలాజీ ఎన్క్లేవ్లో జరిగిన ఆత్మహత్య ఘటన దర్యాప్తులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రైవేట్ ఉద్యోగి ఉరివేసుకుని మృతి చెందిన ఘటనను పరిశీలించిన పోలీసులు, అతని గదిలోని బ్యాగ్లో ఒక నాటు తుపాకీతో పాటు మూడు లైవ్ రౌండ్లు స్వాధీనం చేసుకోవడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం, ఒంగోలు ప్రాంతానికి చెందిన తోమటి వెంకట్రావు మల్లంపేటలో నివాసం ఉంటూ ప్రణీత్ ప్రణవ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందడంతో దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన సమయంలో మృతుడి గదిలోని బ్యాగ్లో ఒక నాటు తుపాకీ, మూడు లైవ్ రౌండ్లు లభించాయి. ఈ పరిణామంతో ఆత్మహత్య ఘటనతో పాటు ఆయుధం అతని వద్దకు ఎలా వచ్చింది, దాని వెనుక ఏదైనా ఇతర కారణం ఉందా అనే కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు విస్తరించారు.
ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాల కారణంగా వెంకట్రావు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం ఉన్నప్పటికీ, నాటు తుపాకీ లభించడం కేసుకు అదనపు ప్రాధాన్యతను తీసుకొచ్చింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

