కామారెడ్డి వ్యవసాయం, పామాయిల్ సాగు, రైతు అంశాలపై చర్చ…
హైదరాబాద్, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి): కామారెడ్డి నియోజకవర్గ రైతుల సమస్యలు, పంటల పరిస్థితి, వ్యవసాయాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ అలీ గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి చర్చించారు.
ఇటీవల వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పంటల ప్రస్తుత పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, పామాయిల్ సాగు విస్తరణ వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్ సాగు విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలోనూ రైతులకు అవసరమైన సహకారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. పామాయిల్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తూ రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటోందని మంత్రి తుమ్మల ఇప్పటికే పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
అలాగే రైతులకు అవసరమైన మద్దతు, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, జిల్లాలో అమలు చేయాల్సిన పలు అభివృద్ధి అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కామారెడ్డి జిల్లాకు సంబంధించిన పలు ప్రతిపాదనలను షబ్బీర్ అలీ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గూడెం శ్రీను, భీమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

