విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలపై NITHMలో ప్రత్యేక వర్క్షాప్..
హైదరాబాద్, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి): పర్యాటక, హాస్పిటాలిటీ రంగాల్లో భారత్–ఫ్రాన్స్ మధ్య విద్యా, వృత్తిపరమైన, సంస్థాగత సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (NITHM)లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. బెంగళూరులోని ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్, ఫ్రెంచ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మార్క్ లామీ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ YAC&C శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, NITHM చైర్పర్సన్ వాణి ప్రసాద్ అధ్యక్షత వహించారు.
ఆహారం, గ్యాస్ట్రోనమీ, సంస్కృతి, పర్యాటకం, హాస్పిటాలిటీ రంగాలు భారత్–ఫ్రాన్స్ ప్రజలను మరింత దగ్గర చేస్తాయని వాణి ప్రసాద్ పేర్కొన్నారు. విద్యార్థులు అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఫ్రెంచ్ సంస్కృతి, సమాజంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
NITHM డైరెక్టర్ ప్రొఫెసర్ వి. వెంకట రమణ మాట్లాడుతూ ఫ్రెంచ్ పరిశ్రమలు, విద్యా సంస్థలతో సంయుక్త పరిశోధనలు, విద్యార్థి మార్పిడి, ఫ్రెంచ్ భాషా శిక్షణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
భారత్తో ఆర్థిక, విద్యా, సాంస్కృతిక సంబంధాలను ఫ్రాన్స్ మరింత బలోపేతం చేస్తోందని మార్క్ లామీ తెలిపారు. హైదరాబాద్ ఏరోస్పేస్, ఫార్మా, హాస్పిటాలిటీ, టెక్నాలజీ రంగాల్లో ఫ్రెంచ్ సహకారానికి కీలక కేంద్రంగా ఎదిగిందన్నారు. సనోఫీ, ఎయిర్బస్, సఫ్రాన్, అకార్ వంటి ఫ్రెంచ్ సంస్థలు భారత్లో బలమైన ఉనికిని కలిగి ఉన్నాయని చెప్పారు.
విద్యార్థులు ఇంటర్న్షిప్లు, ఉన్నత విద్య, అంతర్జాతీయ అనుభవం, సాంస్కృతిక మార్పిడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మార్క్ లామీ సూచించారు. భాషలను నేర్చుకోవడం ద్వారా అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పర్యాటక విద్య, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, నైపుణ్యాభివృద్ధి, సాంస్కృతిక, సుస్థిర పర్యాటకం తదితర అంశాలపై చర్చించారు. ఇండో–ఫ్రెంచ్ విద్యా, వృత్తిపరమైన సహకారానికి కొత్త అవకాశాలను అన్వేషించేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది.

