సింగరేణి చరిత్రలో తొలి అధ్యాయం.. ఇంధన భద్రతకు చారిత్రక మైలురాయి…
హైదరాబాద్, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి):
సింగరేణి చరిత్రలో మరో కీలక ఘట్టానికి తెరలేచింది. ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి ఉత్పత్తి చేసిన తొలి బొగ్గు రైలు తెలంగాణకు చేరుకుంది. దీంతో రాష్ట్ర ఇంధన భద్రత మరింత బలోపేతం కానుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత తొమ్మిదేళ్లుగా వివిధ కారణాలతో ముందుకు సాగని నైనీ బొగ్గు బ్లాక్ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఒడిశా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని కార్యరూపంలోకి తీసుకువచ్చిందన్నారు. నైనీ గని నుంచి బయలుదేరిన 59 వ్యాగన్లలో సుమారు 4 వేల టన్నుల అత్యుత్తమ G-10 గ్రేడ్ బొగ్గు 1,131 కిలోమీటర్లు ప్రయాణించి సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు చేరిందని వివరించారు.
ఈ పరిణామం తెలంగాణ విద్యుత్ రంగానికి కొత్త బలాన్ని అందిస్తుందని, భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు లభ్యత మరింత మెరుగుపడుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
నైనీ బొగ్గు గని అభివృద్ధి, తొలి బొగ్గు రవాణా విజయవంతం కావడంలో అహర్నిశలు శ్రమించిన సింగరేణి అధికారులు, ఇంజినీర్లు, కార్మికులను ఆయన అభినందించారు. ఈ విజయంతో సింగరేణి విస్తరణకు, తెలంగాణ ఇంధన స్వావలంబనకు మరో బలమైన అడుగు పడిందని పేర్కొన్నారు.

