📄 ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సెప్టెంబర్‌ 1 నుంచి తమిళనాడు ఆలయాల్లో మొబైల్‌ నిషేధం ..

సెప్టెంబర్‌ 1 నుంచి తమిళనాడు ఆలయాల్లో మొబైల్‌ నిషేధం ..

వీఐపీ దర్శనాలకు కొత్త నిబంధనలు.. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు..

చెన్నై, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి): తమిళనాడులోని ప్రధాన ఆలయాల్లో సెప్టెంబర్‌ 1 నుంచి మొబైల్‌ ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించనున్నారు. ఆలయ పవిత్రతను కాపాడటంతో పాటు దేవతల విగ్రహాలు, గర్భగుడుల ఫొటోలు, వీడియోలు తీయడం, రీల్స్‌ చేయడం వంటి వాటిని అడ్డుకునేందుకు హిందూ ధార్మిక, ధర్మాదాయ శాఖ (హెచ్‌ఆర్‌అండ్‌సీఈ) ఈ నిర్ణయం తీసుకుంది. మొబైల్‌ ఫోన్లను భద్రపరిచేందుకు ఆలయాల్లో ప్రత్యేక డిపాజిట్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

20 రోజుల్లో డిపాజిట్‌ కేంద్రాలు

సెప్టెంబర్‌ 1 నాటికి మొబైల్‌ ఫోన్లు భద్రంగా జమ చేసుకునే సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు శాఖ ఆదేశించింది. ప్రవేశ ద్వారాలతో పాటు భక్తులకు కనిపించే ప్రధాన ప్రదేశాల్లో మొబైల్‌ నిషేధానికి సంబంధించిన సూచనలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. 2022లోనే మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు ఆలయాల్లో మొబైల్‌ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని ఆదేశిస్తూ, భక్తుల సౌకర్యం కోసం డిపాజిట్‌ లాకర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.

రీల్స్‌, ఫొటోలపై ప్రత్యేక దృష్టి

ఆలయాల్లో మొబైల్‌ ఫోన్లతో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం ఇటీవల సాధారణమైంది. ముఖ్యంగా గర్భగుడులు, దేవతల విగ్రహాల చిత్రీకరణతో పాటు రీల్స్‌ కోసం ఆలయ ప్రాంగణాల్లో షూటింగ్‌ చేయడాన్ని ఇకపై అనుమతించకూడదని శాఖ స్పష్టం చేసింది. మొబైల్‌ వినియోగం భక్తుల ఏకాగ్రతకు ఆటంకం కలిగించడంతో పాటు ఆలయ సంప్రదాయాలు, పవిత్రతకు భంగం కలిగించే అవకాశం ఉందన్న కారణాలతో ఈ నిబంధనలు అమలు చేయనున్నారు.

వీఐపీ దర్శనాలకూ కఠిన నిబంధనలు

సినీ నటులు, నటీమణులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖుల ఆలయ సందర్శనలపై కూడా కొత్త ప్రోటోకాల్‌ అమల్లోకి రానుంది. ప్రముఖుల పర్యటనకు కనీసం ఒక రోజు ముందే హెచ్‌ఆర్‌అండ్‌సీఈ కమిషనర్‌కు సమాచారం ఇవ్వాలి. సందర్శన తేదీ, సమయం, వెంట వచ్చే వ్యక్తుల సంఖ్య తదితర వివరాలను అందించాలి. అనూహ్యంగా పర్యటన ఖరారైతే వెంటనే శాఖకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

సామాన్య భక్తుల దర్శనానికి ఆటంకం వద్దు

వీఐపీల పర్యటనల కారణంగా సాధారణ భక్తుల దర్శనం, ఆలయ ప్రవేశం, నిష్క్రమణకు ఎలాంటి అంతరాయం కలగకూడదని స్పష్టం చేశారు. ప్రముఖుల పర్యటన సమయంలో ఆలయ ప్రాంగణంలో ఫొటోగ్రఫీ, వీడియో చిత్రీకరణకు అనుమతి ఇవ్వకూడదని ఆదేశించారు. వీఐపీ భద్రత పేరుతో భక్తుల సాధారణ రాకపోకలు నిలిచిపోకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

2022లోనే హైకోర్టు ఆదేశాలు

తమిళనాడు ఆలయాల్లో మొబైల్‌ నిషేధానికి ఇది పూర్తిగా కొత్త నిర్ణయం కాదు. తిరుచెందూర్‌ సుబ్రమణ్యస్వామి ఆలయంలో మొబైల్‌ వినియోగాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై 2022 డిసెంబర్‌లో మద్రాస్‌ హైకోర్టు రాష్ట్రంలోని ఆలయాల్లో మొబైల్‌ వినియోగాన్ని నిరోధించాలని హెచ్‌ఆర్‌అండ్‌సీఈ శాఖను ఆదేశించింది. ఆలయాల పవిత్రత, ప్రశాంతతను కాపాడటమే ఉద్దేశమని కోర్టు పేర్కొంది.

ఇప్పటికే పలు ప్రముఖ ఆలయాల్లో మొబైల్‌ ఫోన్లపై ఆంక్షలు అమలవుతున్నప్పటికీ, తాజాగా ప్రధాన ఆలయాలన్నింటికీ ఒకే విధమైన నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు శాఖ చర్యలు చేపట్టింది. దీంతో ఇకపై తమిళనాడు ఆలయాల్లో భక్తులు మొబైల్‌ను బయటే డిపాజిట్‌ చేసి దర్శనానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!