📄 ePaper
Friday, August 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాంగ్రెస్‌లో ‘వలస’ ఆధిపత్యం వద్దు!

కాంగ్రెస్‌లో ‘వలస’ ఆధిపత్యం వద్దు!

నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది.. రాహుల్‌ నాయకత్వంలోనే పనిచేస్తా: రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 14 (నవజ్యోతి ప్రతినిధి):
కాంగ్రెస్‌ పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల ఆధిపత్యం పెరుగుతోందని, దీంతో ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన నిజమైన కాంగ్రెస్‌ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, రాహుల్‌గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను, ప్రభుత్వాన్ని విమర్శించడం తన ఉద్దేశం కాదని.. పార్టీ ప్రజల్లో బలహీనపడకూడదనే ఉద్దేశంతోనే ఈ అంశాలను ప్రస్తావిస్తున్నానని తెలిపారు.

‘వలస’ నేతల ఆధిపత్యం వద్దు

ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కాంగ్రెస్‌ కార్యకర్తలను అణచివేయడం సరికాదని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవారు, కాంగ్రెస్‌ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు తగిన గౌరవం దక్కాలని కోరారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించాలని సూచించారు.

పాత కేడర్‌కు రాజకీయ అవకాశాలు

కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా నాయకత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

తెలంగాణ ఆత్మగౌరవంతో పాలన

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి అనుగుణంగా ప్రజాపాలన సాగాలని ఆయన అన్నారు. సీమాంధ్ర పాలకుల మీడియా చెప్పుచేతల్లో తెలంగాణ ప్రభుత్వం నడవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పేదలు, సామాన్య ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలని.. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని పేర్కొన్నారు.

‘రాహుల్‌ నాయకత్వంలోనే పనిచేస్తా’

రాహుల్‌గాంధీ నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌కు తాను దూరంగా ఉన్నానన్న ప్రచారంలో వాస్తవం లేదని గతంలోనూ స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ పనిచేస్తోందని, తాను కూడా పార్టీ కార్యక్రమాల్లో కొనసాగుతున్నానని జూలైలో చెప్పారు.

హైకమాండ్‌ దృష్టికి వివాదం?

రాజగోపాల్‌రెడ్డి వరుస వ్యాఖ్యలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం గతంలోనూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలను పరిశీలించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ ప్రకటించడం, క్రమశిక్షణా కమిటీతో చర్చించినట్లు చెప్పడం అప్పట్లో చర్చకు దారితీసింది.

రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై తుది నిర్ణయం హైకమాండ్‌ పరిధిలో ఉంటుందని మహేష్‌కుమార్‌గౌడ్‌ గతంలో పేర్కొన్నారు. అయితే, క్రమశిక్షణా చర్యల విషయంలో అధికారికంగా ఏ నిర్ణయం వెలువడిందనే దానిపై స్పష్టత లేకపోవడంతో ప్రస్తుతానికి ‘చర్యలు తప్పవా?’ అనే చర్చ మాత్రమే కొనసాగుతోంది.

మంత్రి పదవి అంశం కూడా..

రాజగోపాల్‌రెడ్డి గతంలో తనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చారని బహిరంగంగా చెప్పిన విషయం కూడా పార్టీలో చర్చకు వచ్చింది. మంత్రి పదవిపై హామీ ఇచ్చిన విషయం వాస్తవమేనని మహేష్‌కుమార్‌గౌడ్‌ కూడా అప్పట్లో పేర్కొన్నారు. అయితే కేబినెట్‌లో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పదవి ఉండటం ఒక కారణమని ఆయన వివరించారు.

ఇక తాజాగా రాజగోపాల్‌రెడ్డి పాత కాంగ్రెస్‌ కార్యకర్తలకు న్యాయం, తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల ఆధిపత్యానికి అడ్డుకట్ట వంటి అంశాలను ప్రస్తావించడంతో పార్టీ అంతర్గతంగా మరోసారి చర్చ మొదలైంది. తన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను బలహీనపర్చేందుకు కాదని, మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనేనని రాజగోపాల్‌రెడ్డి చెబుతున్నారు.

పార్టీ వ్యతిరేక స్వరమా.. కేడర్‌ అసంతృప్తిని హైకమాండ్‌కు చేరవేసే ప్రయత్నమా?

రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు పార్టీ వ్యతిరేక స్వరమా? లేక కాంగ్రెస్‌లో పాత కేడర్‌ అసంతృప్తిని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమా? అన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!