న్యూఢిల్లీ, ఆగస్టు 14 (నవజ్యోతి ప్రతినిధి):
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థులపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. విద్యార్థులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
నల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థులు సీజేఐ సూర్యకాంత్ను స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై బీసీఐ తొలుత రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీ చేసి.. 2026 బ్యాచ్ విద్యార్థులను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని సూచించింది. తీవ్ర విమర్శలు రావడంతో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. అనంతరం ఆ బ్యాచ్పై కొనసాగించిన విచారణను కూడా బీసీఐ గురువారం రాత్రి పూర్తిగా మూసివేసింది.
‘విద్యార్థులను ఎవరు ఆపగలరు?’
ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను శుక్రవారం విచారించిన సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహన్ల ధర్మాసనం.. ‘విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉంది. వారిని ఎవరు ఆపగలరు?’ అంటూ వ్యాఖ్యానించింది.
విద్యార్థులు తనకు రాసిన లేఖ తమ మధ్య జరిగిన సంభాషణగా పేర్కొంటూ.. ఈ విషయంలో బీసీఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది.
విద్యార్థులపై చర్యలు వద్దు
బీసీఐ తన ఉత్తర్వులు ఉపసంహరించుకున్న విషయాన్ని కోర్టు నమోదు చేసింది. అదే సమయంలో నల్సార్ విద్యార్థులు, అధ్యాపకులపై బీసీఐ లేదా ఏదైనా రాష్ట్ర బార్ కౌన్సిల్ ఈ వ్యవహారానికి సంబంధించి శిక్షాత్మక చర్యలు తీసుకోకూడదని మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. బీసీఐకి నోటీసులు జారీ చేసి రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
‘సుప్రీంకోర్టు బార్లో చేరండి’
విద్యార్థుల వృత్తి భవిష్యత్తుపై ప్రభావం పడకుండా సీజేఐ సూర్యకాంత్ మరో కీలక సూచన చేశారు. విద్యార్థులు వీలైనంత త్వరగా న్యాయవాదులుగా నమోదు చేసుకుని సుప్రీంకోర్టు బార్లో చేరాలని సూచించారు. న్యాయ సేవా కార్యక్రమాల్లో వారికి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
బీసీఐ నిర్ణయం వెనక్కి
ఇదిలా ఉండగా.. నల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థులకు వివాదంలో ఎలాంటి పాత్ర లేదని పరిశీలనలో తేలిందని బీసీఐ చైర్మన్ మానన్ కుమార్ మిశ్రా ప్రకటించారు. సీనియర్ న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం విచారణను పూర్తిగా ముగించినట్లు తెలిపారు.
విద్యార్థుల నిరసన హక్కు, న్యాయ విద్యాసంస్థల స్వతంత్రత, బీసీఐ అధికార పరిధిపై ఈ పరిణామం మరోసారి చర్చకు దారితీసింది.

