డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహణ.. కేంద్ర మంత్రిని కలిసిన రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి
న్యూఢిల్లీ, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్ను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని
రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గురువారం ఢిల్లీలో
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయను మంత్రి
శ్రీహరి, ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్రెడ్డి, శాట్స్ చైర్మన్
శివసేనారెడ్డి కలిశారు.
తెలంగాణకు ఖేలో ఇండియా గేమ్స్ కేటాయించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి
మాండవీయకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి
రేవంత్రెడ్డి ఆహ్వాన లేఖను కేంద్ర మంత్రికి అందజేశారు.
డిసెంబర్ 11 నుంచి 22 వరకు 12 రోజుల పాటు తెలంగాణలో ఖేలో ఇండియా
గేమ్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
క్రీడలను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించామని,
ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తామని శ్రీహరి చెప్పారు.
ప్రధాని మోదీని వ్యక్తిగతంగా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్రెడ్డి అపాయింట్మెంట్
కోరనున్నారని తెలిపారు.
రాష్ట్రంలో కొత్త క్రీడా విధానాన్ని అమలు చేస్తూ క్రీడారంగ అభివృద్ధికి
విప్లవాత్మక చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని
ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రాధాన్యం
ఇస్తున్నామని తెలిపారు.
అందరి సహకారంతో ఖేలో ఇండియా గేమ్స్ను విజయవంతంగా నిర్వహించి తెలంగాణను ప్రముఖ
క్రీడా గమ్యస్థానంగా మరింత గుర్తింపు పొందేలా చేస్తామని మంత్రి శ్రీహరి అన్నారు.

