- టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ధర్నా
- ఫీజు రాయితీ కల్పించే వరకు దశలవారీ ఆందోళనలు – మండల అధ్యక్షుడు షేక్ రసూల్
మాడుగులపల్లి, జూలై 6 (నవజ్యోతి ప్రతినిధి)
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 75 శాతం ఫీజు రాయితీ కల్పించే వరకు దశలవారీ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మాడుగులపల్లి మండల అధ్యక్షుడు షేక్ రసూల్, ప్రధాన కార్యదర్శి దర్శనం రాంబాబు హెచ్చరించారు. సోమవారం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో తహసీల్దార్, మండల విద్యాధికారి (ఎంఈఓ), ఎంపీడీవో కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం నార్కెట్పల్లి – అద్దంకి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షేక్ రసూల్ మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల కారణంగా జర్నలిస్టులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఫీజులు చెల్లించలేక కొందరు విద్యార్థులు చదువును మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలని గతంలో జిల్లా విద్యాశాఖాధికారి, కలెక్టరేట్లో పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే ఫీజు రాయితీ అమలుకు సర్క్యులర్లు జారీ చేసిన నేపథ్యంలో, నల్లగొండ జిల్లాలో కూడా 75 శాతం ఫీజు రాయితీ అమలు చేసేలా వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల విద్యాధికారి వెంకటమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్పందించిన అధికారులు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ అమలుకు చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) వేములపల్లి మండల అధ్యక్షుడు షేక్ మౌలాలి, ఉపాధ్యక్షుడు పొదిలి నాగరాజు, చిట్యాల సురేందర్, బొంగర్ల శ్రీనివాస్, చెరుకుపల్లి రాజు, బోలికొండ సైదులు, గుడుగుంట్ల శ్రవణ్ కుమార్, పెరుమల్ల భరత్ కుమార్, షేక్ అఫ్జల్, ఎస్.ఎన్. రెడ్డి, రామకృష్ణ, సతీష్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

